Gaikwad: దక్షిణాఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్ కోసం ప్రకటించిన 15 మంది సభ్యుల భారత జట్టులో ప్రధానంగా చెప్పుకోదగిన విషయం రుతురాజ్ గైక్వాడ్ (Gaikwad) పునరాగమనం. గత రెండేళ్లుగా దేశీయ క్రికెట్పై దృష్టి సారించి, ఇండియా-ఎ తరఫున అద్భుతంగా రాణించిన ఈ ఓపెనింగ్ బ్యాటర్కు సీనియర్ జట్టులో చోటు దక్కింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్న గైక్వాడ్ చివరగా డిసెంబర్ 2023లో ఒక ODI మ్యాచ్ ఆడాడు. జట్టులో చోటు దక్కించుకోవడానికి అతను అర్హుడే అయినప్పటికీ అదృష్టం కూడా కొంతవరకు కీలక పాత్ర పోషించింది.
గత రెండేళ్లుగా జట్టులో బ్యాటింగ్ స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొనడం, ముఖ్యంగా ఓపెనింగ్ స్థానంలో శుభ్మన్ గిల్ ఎదుగుదల, మధ్య వరుసలో నిరూపితమైన ఆటగాళ్లైన కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ల కారణంగా, సెలెక్టర్లు అతన్ని పదేపదే విస్మరించారు. అయితే ప్రస్తుతం ODI కెప్టెన్గా ఉన్న శుభ్మన్ గిల్ మెడ గాయం కారణంగా దూరం కావడం, శ్రేయాస్ అయ్యర్ గాయం నుండి కోలుకుంటుండటంతో గైక్వాడ్కు టీమిండియా జెర్సీని మళ్లీ ధరించే అవకాశం చిక్కింది. ఈ మహారాష్ట్ర బ్యాటర్ ఇప్పటివరకు ఆరు ODIలలో ఆడాడు. ఇందులో 19.16 సగటు, 73 స్ట్రైక్ రేట్తో 115 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 71.
నిలకడగా మంచి స్కోర్లు సాధిస్తూ గైక్వాడ్ ఇటీవల అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికా-ఏ జట్టుతో జరిగిన ODI సిరీస్లో ఇండియా-ఎ గెలిచినప్పుడు అతను ఒక సెంచరీ, ఒక ఫిఫ్టీ సహా 85.00 సగటుతో 210 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును గెలుచుకున్నాడు.
సీనియర్ జట్టులో యశస్వి జైస్వాల్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉన్నందున గైక్వాడ్ నెంబర్ 4 స్థానంపై దృష్టి సారించే అవకాశం ఉంది. అయితే 2022లో రోడ్డు ప్రమాదం నుండి కోలుకున్న తర్వాత కేవలం ఒకే ODI ఆడిన రిషభ్ పంత్, ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్పై హీరోగా నిలిచిన తిలక్ వర్మ కూడా అదే స్థానం కోసం పోటీ పడుతున్నందున తుది ప్లేయింగ్ XIలో గైక్వాడ్కు చోటు దక్కడం కష్టమే. అతని అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటే 31 ODIలలో 27 ఇన్నింగ్స్లలో 33 కంటే ఎక్కువ సగటుతో 871 పరుగులు చేసిన పంత్కు గైక్వాడ్ కంటే ముందు స్థానం దక్కవచ్చు.
గైక్వాడ్, తిలక్ మధ్య పోటీ ఉంటే గైక్వాడ్ ముందంజలో ఉండే అవకాశం ఉంది. తిలక్ వర్మ చివరి ఐదు లిస్ట్-ఎ మ్యాచ్లలో 11, 29 నాటౌట్, 39, 3, 94 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాపై జరిగిన T20I సిరీస్లో కూడా అతను మూడు ఇన్నింగ్స్లలో కేవలం 34 పరుగులు చేసి నిరాశపరిచాడు. మరోవైపు గైక్వాడ్ దేశీయ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన చివరి ఎనిమిది మ్యాచ్లలో 90.50 సగటుతో 724 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, మూడు ఫిఫ్టీలు ఉన్నాయి. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్పై వెస్ట్ జోన్ తరపున ఆడినప్పుడు చేసిన 184 పరుగులు అతని అత్యుత్తమ స్కోరు. మొత్తంగా 89 లిస్ట్-ఎ మ్యాచ్లలో గైక్వాడ్ 100 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో 57.39 సగటుతో 4,534 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 18 ఫిఫ్టీలు ఉన్నాయి. అతని అత్యధిక స్కోరు 220 నాటౌట్. గిల్ లేకపోవడంతో నవంబర్ 30 నుండి ప్రారంభమయ్యే స్వదేశంలో జరిగే దక్షిణాఫ్రికా సిరీస్లో భారత్కు కేఎల్ రాహుల్ నాయకత్వం వహించనున్నాడు.
భారత్ ODI స్క్వాడ్
- కేఎల్ రాహుల్ (కెప్టెన్ & వికెట్ కీపర్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్షదీప్ సింగ్, ధ్రువ్ జురెల్.
